ఏపీ ఉద్యోగులకు షాక్.. రేపు సెలవు ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు
ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. గురువారం నాడు అత్యవసరమైతే తప్ప ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది విజయవాడకు చేరుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఉద్యోగులందరినీ అరెస్ట్ చేసినా 10 మందితో అయినా ఛలో విజయవాడ నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధనసమితి నేత బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అంతకుముందు విజయవాడ సీపీ కాంతిరాణా టాటాను కలిసేందుకు వెళ్లిన పీఆర్సీ సాధన సమితి నేతలకు చుక్కెదురైంది. ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతివ్వాలని కోరడానికి విజయవాడ సీపీ కార్యాలయానికి పీఆర్సీ సాధన సమితి నేతలు వెళ్లగా.. వారితో మాట్లాడి ఏడీసీపీ రమణమూర్తి వెనక్కి పంపేశారు. అయితే తాము సీపీని కలవడానికి రాలేదని… ఇప్పటివరకు తమకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలపడానికి వచ్చామని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా విజయవాడ సీపీ సహకారం అందించలేకున్నా.. ఆయన మనస్సు తమతోనే ఉందన్నారు.
0 comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.